వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో పాకిస్థాన్కు మరోసారి భారీ నిరాశ ఎదురైంది. ట్రినిడాడ్లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యం కూడా సంపాదించింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి పాకిస్థాన్ బ్యాటింగ్ను పూర్తిగా కుప్పకూల్చాడు. రెండో ఇన్నింగ్స్లో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్కు ఆరంభం నుంచే షాక్లు తగిలాయి. వరుసగా వికెట్లు కోల్పోతూ ఒక దశలో 71 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పూర్తిగా కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ బాబర్ ఆజమ్ చివరి వరకు పోరాడాడు.
నంబర్ 11 బ్యాటర్ మహ్మద్ అబ్బాస్తో కలిసి చివరి వికెట్కు, 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి వెస్టిండీస్ విజయాన్ని కొంతసేపు ఆలస్యం చేశాడు. అబ్బాస్ 23 పరుగులు చేసి అవుట్ కావడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 120 పరుగుల వద్ద ముగిసింది. ఈ మ్యాచ్లో బాబర్ ఆజమ్ ఒంటరి పోరాటం చేశాడు. అతను అజేయంగా 58 పరుగులు చేసి తన టెస్ట్ కెరీర్లో 32వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 81 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన బాబర్కు మరో ఎండ్లో మాత్రం ఎవరి నుంచి సరైన సహకారం లభించలేదు.
మిగతా బ్యాటర్లు కలిసి కేవలం 38 పరుగులు మాత్రమే చేయడం పాకిస్థాన్ ఓటమికి ప్రధాన కారణమైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత బాబర్ ఆజమ్ కూడా బ్యాటింగ్ వైఫల్యాన్ని అంగీకరించాడు. “గత కొన్ని రోజులుగా మేము మంచి క్రికెట్ ఆడాం. కానీ ఈ రోజు బ్యాటింగ్ యూనిట్గా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోయాం. తర్వాతి మ్యాచ్లో ఈ తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటాం” అని బాబర్ తెలిపాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో కూడా పాకిస్థాన్ ఇదే తరహా తప్పులు చేసింది.
ఒక దశలో 244 పరుగులకు 4 వికెట్లు మాత్రమే కోల్పోయిన పాకిస్థాన్… ఆ తర్వాత కేవలం 38 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లు కోల్పోయి 282 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో వెస్టిండీస్కు తొలి ఇన్నింగ్స్లో 29 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 311 పరుగులు చేసింది. పాకిస్థాన్ తరఫున షాన్ మసూద్ సెంచరీ చేయగా, ఇమామ్ ఉల్ హక్ 63 పరుగులు, బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీ చేశారు. అయితే మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి పాకిస్థాన్ జట్టులో కేవలం ఆరుగురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. అంతేకాకుండా షాన్ మసూద్ గాయం కూడా పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బగా మారింది.
తొలి ఇన్నింగ్స్లో చేతికి గాయం కావడంతో రెండో ఇన్నింగ్స్లో అతను తన సాధారణ మూడో స్థానంలో కాకుండా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఇక నాలుగో రోజు వెస్టిండీస్ 126 పరుగులకు 7 వికెట్లతో ఆటను ప్రారంభించింది. షమర్ జోసెఫ్ 16 పరుగులు, కెమర్ రోచ్ 13 పరుగులు జోడించడంతో వెస్టిండీస్ ఆధిక్యం 200 పరుగులు దాటింది. అదే చివరకు మ్యాచ్ను గెలిపించే స్కోరుగా మారింది. వెస్టిండీస్ బౌలింగ్లో జేడెన్ సీల్స్కు కెమర్ రోచ్, జస్టిన్ గ్రీవ్స్ కూడా మంచి సహకారం అందించారు. ఇద్దరూ చెరో రెండు వికెట్లు తీశారు. జస్టిన్ గ్రీవ్స్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేయడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. పాకిస్థాన్ తరఫున మహ్మద్ అబ్బాస్ బౌలింగ్లో రాణించాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి మొత్తం 8 వికెట్లు తీసినా, బ్యాటర్లు విఫలం కావడంతో అతని శ్రమ వృథా అయింది. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఆదివారం ప్రారంభం కానుంది. సిరీస్ను సమం చేయాలని పాకిస్థాన్ భావిస్తుండగా, మరో విజయంతో సిరీస్ను కైవసం చేసుకోవాలని వెస్టిండీస్ లక్ష్యంగా పెట్టుకుంది.


