క్రికెట్లో Age ఫ్రాడ్కు సంబంధించి B C C I సంచలన నిర్ణయం తీసుకుంది! అండర్ 19 జట్టులో ఉన్న ఒక ఆటగాడిపై వయసుకు సంబంధించిన తేడాలు బయటపడటంతో.. అతడిని జట్టు నుంచి తప్పించడమే కాకుండా, ఏకంగా రెండేళ్ల పాటు నిషేధం విధించింది. అంతేకాదు.. అతడి స్థానంలో అండర్ 19 జట్టులో ఇద్దరు కొత్త ఆటగాళ్లను కూడా B C C I ఎంపిక చేసింది. అసలు ఏం జరిగింది? ఆ ఆటగాడి వయసుపై అనుమానాలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు చూద్దాం. జూనియర్ క్రికెట్లో డాక్యుమెంట్లను మార్చడం లేదా వయసును తప్పుగా చూపించడంపై B C C I చాలా సీరియస్గా ఉంది.
ఇలాంటి వ్యవహారాలను ఏమాత్రం సహించబోమని ఇప్పటికే స్పష్టం చేసింది. ఇటీవల బెంగాల్లోనే 60 మందికి పైగా క్రికెటర్లపై వయసుకు సంబంధించిన తేడాల కారణంగా సస్పెన్షన్ వేటు పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో B C C I కూడా వెంటనే చర్యలు చేపట్టింది. ఇండియా అండర్ 19 జట్టులో ఉన్న రోహిత్ యాదవ్పై వయసుకు సంబంధించిన తేడాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడిని ఆస్ట్రేలియా అండర్ 19తో జరగబోయే మ్యాచ్ల కోసం ఎంపిక చేసిన జట్టు నుంచి తొలగించారు. రోహిత్ యాదవ్ స్థానంలో.. వన్-డే జట్టులో సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కు చెందిన ఆర్యన్ సావ్సాని ఎంపికయ్యాడు.
అదే సమయంలో.. మల్టీ-డే జట్టులో రోహిత్ స్థానాన్ని హర్యానా క్రికెట్ అసోసియేషన్కు చెందిన తన్మయ్ బలోడా భర్తీ చేయనున్నాడు. అయితే రోహిత్ వయసుపై అనుమానాలు ఎలా వచ్చాయి? క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్, B C C I Age-వెరిఫికేషన్ సెల్ కలిసి రోహిత్కు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించాయి. ఈ పరిశీలనలో పలు అధికారిక పత్రాల్లో భారీ తేడాలు కనిపించాయి. ముఖ్యంగా.. అతడి జనన ధృవపత్రాల్లో వేర్వేరు వివరాలు కనిపించాయి. అంతేకాదు, ఆధార్ రికార్డుల్లో కూడా పుట్టిన సంవత్సరం పలుమార్లు మార్చినట్లు గుర్తించారు. కొన్ని రికార్డుల్లో రోహిత్ పుట్టిన సంవత్సరం 2006గా ఉండగా..
మరికొన్ని రికార్డుల్లో 2007, 2008, 2009, 2010గా కూడా కనిపించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వయసుకు సంబంధించిన ఈ తేడాలపై B C C I కఠిన చర్యలు తీసుకుంది. రోహిత్ యాదవ్ లెగ్ స్పిన్నర్. ఇటీవల శ్రీలంక పర్యటనలో ఇండియా అండర్ 19 జట్టు తరఫున అద్భుతంగా బౌలింగ్ చేసి.. ఒక మ్యాచ్లో ఏకంగా 6 వికెట్లు కూడా తీసుకున్నాడు. అయితే ఇప్పుడు వయసుకు సంబంధించిన వివాదం కారణంగా అతడి క్రికెట్ కెరీర్కు భారీ షాక్ తగిలింది. B C C I రోహిత్ యాదవ్పై రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ సమయంలో B C C I ఆధ్వర్యంలో జరిగే దేశవాళీ క్రికెట్తో పాటు అండర్ 19 స్థాయి పోటీల్లో కూడా అతడు ఆడలేడు. ఇక మార్పుల తర్వాత ఇండియా అండర్ 19 వన్-డే జట్టుకు లక్ష్య రైచందాని కెప్టెన్గా కొనసాగనున్నాడు.
యశ్వర్ధన్ చౌహాన్ వైస్ కెప్టెన్గా ఉంటాడు. ఆర్యన్ సావ్సాని కొత్తగా జట్టులోకి వచ్చాడు. మల్టీ-డే జట్టులో యశ్వర్ధన్ చౌహాన్ కెప్టెన్గా, లక్ష్య రైచందాని వైస్ కెప్టెన్గా ఉండనున్నారు. రోహిత్ స్థానంలో తన్మయ్ బలోడా జట్టులోకి వచ్చాడు. ఈ ఘటనతో B C C I మరోసారి కీలక సందేశం ఇచ్చింది. జూనియర్ క్రికెట్లో వయసును తప్పుగా చూపించడం, డాక్యుమెంట్లలో మార్పులు చేయడం లాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసింది. ఎవరైనా క్రికెట్లో వయసుకు సంబంధించిన మోసాలకు పాల్పడితే.. కఠినమైన శిక్షలు తప్పవని B C C I ఈ చర్య ద్వారా హెచ్చరించింది.


