క్రికెట్ అభిమానుల దృష్టి ఇప్పుడు భారత్–అఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న మూడో వన్డేపై ఉంది. మూడు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే టీమిండియా కైవసం చేసుకుంది. దీంతో చివరి మ్యాచ్లో కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి, బెంచ్పై ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది.
ఇలాంటి సమయంలో మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మూడో వన్డే కోసం తన ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించాడు. అయితే అందులో యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు చోటు ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చగా మారింది.
గాయం కారణంగా చాలా రోజులుగా క్రికెట్కు దూరంగా ఉన్న హర్షిత్ రాణా ఇటీవలే మళ్లీ టీమ్లోకి వచ్చాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ పూర్తి చేసుకుని ఫిట్నెస్ క్లియరెన్స్ పొందిన తర్వాత అతడిని అఫ్గానిస్థాన్తో మూడో వన్డే కోసం స్క్వాడ్లో చేర్చారు.
అయితే ఆకాశ్ చోప్రా మాత్రం వెంటనే అతడిని తుది జట్టులో ఆడించకూడదని అభిప్రాయపడ్డాడు. అతని ప్రకారం, హర్షిత్ రాణాకు మరికొంత సమయం ఇవ్వాలి. ముఖ్యంగా రాబోయే ఐదు నుంచి ఆరు వారాల బిజీ షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకుని అతడి ఫిట్నెస్ను జాగ్రత్తగా మేనేజ్ చేయాలని సూచించాడు.
ఆకాశ్ చోప్రా తన ప్లేయింగ్ ఎలెవన్లో యశస్వి జైస్వాల్కు మరో అవకాశం ఇచ్చాడు. యశస్వి ఇప్పటివరకు కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడని, అతడికి మరో అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పాడు.
అలాగే అర్ష్దీప్ సింగ్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని ఆడించాలని చోప్రా సూచించాడు. “ధైర్యమైన నిర్ణయం తీసుకోవాలి. నితీష్ ఫిట్గా ఉంటే అతడిని ఆడించాలి. యశస్విని బయట కూర్చోబెట్టకూడదు, ఎందుకంటే మళ్లీ అతడికి అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఇదిలా ఉంటే టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ హర్షిత్ రాణా ఫిట్నెస్పై కీలక అప్డేట్ ఇచ్చాడు. హర్షిత్ పూర్తిగా కోలుకున్నాడని, ఎన్సీఏ నుంచి క్లియరెన్స్ పొందాడని తెలిపారు.
అయితే వెంటనే మ్యాచ్లో ఆడించడం కంటే ముందుగా టీమ్ వాతావరణంలోకి తిరిగి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. గాయం తర్వాత అతడు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండటం ముఖ్యమని పేర్కొన్నారు.
అంటే మూడో వన్డేలో హర్షిత్ రాణా అరంగేట్రం చేసే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. కానీ రాబోయే సిరీస్లలో అతడి పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది.
మరి టీమ్ ఇండియా చివరి వన్డేలో ప్రయోగాలు చేస్తుందా? లేక బలమైన జట్టుతోనే బరిలోకి దిగుతుందా? హర్షిత్ రాణాకు ఎప్పుడు ఛాన్స్ వస్తుంది? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.


