టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మ జీవితంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయము ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకప్పుడు అతని కోరిక కేవలం వెండి గొలుసును బంగారు గొలుసుతో మార్చుకోవడం మాత్రమే. కానీ అతని అన్న అక్షయ్ మాత్రం ఒక షరతు పెట్టాడు. “ముందు టీమిండియా క్యాప్ సంపాదించు. ఆ తర్వాత నీకు నచ్చిన బంగారు గొలుసు కొనుక్కో” అని చెప్పాడు. 2026 ఐపీఎల్ ప్రారంభానికి ముందు కూడా అశోక్ మరోసారి బంగారు గొలుసు గురించి అడిగాడు. కానీ అప్పుడు కూడా అతని అన్న అదే సమాధానం చెప్పాడు.
“ఇంకా సమయం రాలేదు… ముందు భారత్ జట్టులో చోటు సంపాదించు” అని అన్నాడు. ఇప్పుడు ఆ రోజు వచ్చేసింది. ఈ జూలైలో జింబాబ్వేతో జరగనున్న టీ twenty సిరీస్కు అశోక్ శర్మ భారత జట్టుకు ఎంపికయ్యాడు. దీంతో తన మాట నిలబెట్టుకుంటూ, బెంగళూరులో జరుగుతున్న ఎమర్జింగ్ మెన్ టోర్నమెంట్ ముగించుకుని, ఇంటికి వచ్చిన తర్వాత అశోక్కు నచ్చిన బంగారు గొలుసు కొనిస్తానని అతని అన్న మాట ఇచ్చాడు. అయితే ప్రస్తుతం అశోక్ మనసులో బంగారు గొలుసు గురించి ఆలోచనే లేదు.
భారత జట్టు క్యాప్ ధరించే క్షణం, టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లోకి అడుగు పెట్టే రోజు గురించే ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం ప్రాక్టీస్పైనే ఉందని చెప్పాడు. అశోక్ మాట్లాడుతూ… “నేను ఇప్పటివరకు ఎలా ప్రాక్టీస్ చేశానో అలాగే కొనసాగిస్తాను. నా ప్రధాన బలం హార్డ్ లెంగ్త్ బంతులు వేయడం. అదే నా ఆయుధం. మ్యాచ్ పరిస్థితిని బట్టి అవసరమైతే స్లో బాల్స్, యార్కర్లు కూడా వేస్తాను” అని తెలిపాడు. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లలో ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం రాకపోయినా, అక్కడ చాలా నేర్చుకున్నానని అశోక్ చెప్పాడు. ప్యాట్ కమిన్స్, టిమ్ సౌథీ, షేన్ బాండ్, సందీప్ శర్మ, భారత్ అరుణ్ వంటి దిగ్గజాలతో గడపడం తన కెరీర్కు ఎంతో ఉపయోగపడిందని తెలిపాడు.
2022లో ప్యాట్ కమిన్స్ తనకు ఇచ్చిన సలహాను కూడా గుర్తు చేసుకున్నాడు. “నీ బలం ఏదైతే ఉందో దాన్నే ప్రపంచ స్థాయికి తీసుకెళ్లు. నిద్రలో లేపినా అదే బంతిని కచ్చితంగా వేయగలగాలి. ప్రతి గొప్ప బౌలర్కు ఒక ప్రత్యేక ఆయుధం ఉంటుంది” అని కమిన్స్ చెప్పిన మాటలు తనకు ఎంతో ప్రేరణ ఇచ్చాయని చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ తనను విడుదల చేసిన తర్వాత తాను మరింత కష్టపడ్డానని అశోక్ తెలిపాడు. ఆ నిరాశనే ప్రేరణగా మార్చుకుని సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 22 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. తన వేగం గురించి మాట్లాడుతూ… అండర్ 19 రోజుల్లో గంటకు 130 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసేవాడినని, నిరంతర శిక్షణ, ఫిట్నెస్, మంచి ఆహారం వల్ల ఇప్పుడు 150 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నానని చెప్పాడు. ఇక గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ఇచ్చిన సలహా తన జీవితంలో చాలా ముఖ్యమైందని అశోక్ వెల్లడించాడు.
“ఇండియా ఏ వరకు వచ్చానని సంతోషపడొద్దు. భారత జట్టు తరఫున 100 టెస్టులు ఆడాలనే లక్ష్యం పెట్టుకో. నీ కెరీర్ ఇప్పుడే మొదలైంది” అని నెహ్రా చెప్పారని తెలిపాడు. అయితే అశోక్ మాత్రం వినయంగా స్పందిస్తూ… “100 టెస్టులు ఆడటం చాలా పెద్ద లక్ష్యం. కానీ కనీసం భారత్ తరఫున 60 నుంచి 70 టెస్టులు ఆడాలని నా కల” అని చెప్పాడు. మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ వంటి సీనియర్ బౌలర్లు తనకు ఎప్పుడూ సహాయం చేశారని, ఇండియా-ఏ జట్టులో కూడా ఎంతో నేర్చుకునే అవకాశం దక్కిందని తెలిపాడు.
చివరగా తన కుటుంబం గురించి మాట్లాడుతూ, తన అన్న చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇద్దరిలో ఒక్కరినే క్రికెట్ అకాడమీలో చేర్చే పరిస్థితి రావడంతో, తన అన్న తన కలను పక్కన పెట్టి అశోక్ను ముందుకు పంపాడని చెప్పాడు. ఇప్పటికీ తన ఖర్చులన్నీ అన్నే చూసుకుంటాడని, ఐపీఎల్ సమయంలో ఐప్యాడ్ కొనాలన్నా ముందుగా అన్న అనుమతి తీసుకున్నానని నవ్వుతూ చెప్పాడు. ఇలా ఎన్నో కష్టాలు, త్యాగాలు, కఠిన శ్రమ తర్వాత టీమిండియా జట్టులో చోటు సంపాదించిన అశోక్ శర్మ ఇప్పుడు తన అంతర్జాతీయ కెరీర్ను విజయవంతంగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. జింబాబ్వే సిరీస్లో అతను ఎలా రాణిస్తాడో ఆసక్తిగా ఎదురుచూడాలి.


