రిషభ్ పంత్ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి చేరాడు. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ట్రేడ్ ద్వారా తన పాత జట్టుకు తిరిగొచ్చిన పంత్కు ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ప్రత్యేకంగా స్వాగతం పలికాడు. ఈ స్వాగతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఐపీఎల్ ట్రేడ్లో భాగంగా రిషభ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ను వీడి ఢిల్లీ క్యాపిటల్స్లో చేరాడు. ఈ డీల్లో పంత్ కోసం ఢిల్లీ రూ.15 కోట్లు చెల్లించగా, భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో జట్టుకు వెళ్లాడు.
ట్రేడ్ పూర్తైన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. అందులో అక్షర్ పటేల్.. పంత్తో జరిగిన మొదటి ఫోన్ సంభాషణ గురించి చెప్పాడు. పంత్ ఈ వార్తను చెప్పడానికి పదేపదే కాల్ చేశాడని, కానీ తాను తన బిడ్డతో సమయం గడుపుతుండటంతో కాల్ ఎత్తలేకపోయానని అక్షర్ తెలిపాడు.
తర్వాత అక్షర్ తిరిగి కాల్ చేయగా.. పంత్ చాలా సంతోషంగా “కన్ఫర్మ్ అయిపోయింది భాయ్.. నేను తిరిగి వస్తున్నా” అంటూ చెప్పాడని వెల్లడించాడు. అయితే ఆ సమయంలో చెప్పాలనుకున్న ఒక విషయము ఫోన్లో చెప్పలేకపోయానని అక్షర్ అన్నాడు.
ఆ తర్వాత వీడియోలో అక్షర్ పటేల్ ఫన్నీగా ఒక హిందీ సామెత చెప్పి పంత్కు స్వాగతం పలికాడు. “సుబహ్ కా భులా అగర్ షామ్ కో ఘర్ వాపస్ ఆ జాయే తో ఉసే భులా నహీ కేహ్తే” అంటూ చెప్పాడు. అంటే ఉదయం దారి తప్పిన వ్యక్తి సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తే అతన్ని తప్పిపోయినవాడిగా భావించరు అనే అర్థం.
రిషభ్ పంత్ గతంలో 2016 నుంచి 2024 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడి జట్టులో కీలక ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీ తరఫున 3,284 పరుగులు చేసి ఆ జట్టు చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
అయితే లక్నో సూపర్ జెయింట్స్లో పంత్ ప్రయాణం ఆశించిన స్థాయిలో సాగలేదు. రెండు సీజన్లలో 581 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్గా కూడా జట్టుకు అనుకున్న విజయాలు అందించలేకపోయాడు.
ఇప్పుడు మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్లోకి వచ్చిన పంత్పై భారీ అంచనాలు ఉన్నాయి. తన పాత జట్టుతో కలిసి మరోసారి అద్భుతాలు చేయాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.


