మహిళల టీ twenty ప్రపంచకప్లో ఆస్ట్రేలియా మరో భారీ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం హెడ్డింగ్లీలో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్పై 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది.అయితే నాలుగు మ్యాచ్లు గెలిచినా ఇంకా సెమీఫైనల్ బెర్త్ ఖరారు కాలేదు. ఎందుకంటే దక్షిణాఫ్రికా, భారత్ జట్లు కూడా నాలుగు విజయాలతో ముగించే అవకాశం ఉంది. దీంతో సెమీస్ పోరు ఇంకా ఆసక్తికరంగా మారింది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా తన చివరి మ్యాచ్ను భారత్తో లార్డ్స్ మైదానంలో ఆడనుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే… ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభంలోనే బెత్ మూనీ మొదటి బంతికే ఔటైంది. కానీ ఆ తర్వాత ఎలిస్ పెర్రీ, జార్జియా వోల్ అద్భుతంగా ఆడి జట్టును గట్టి స్థితిలో నిలిపారు. వీరిద్దరూ కలిసి కేవలం 56 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.జార్జియా వోల్ 39 పరుగులు చేయగా, ఎలిస్ పెర్రీ 48 బంతుల్లో 71 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన స్కోరు అందించింది. అన్నాబెల్ సదర్లాండ్ 27 పరుగులు, నికోలా కేరీ 26 పరుగులతో రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది.
200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ మొదటి నుంచే ఒత్తిడిలో పడింది. వరుస వికెట్లు కోల్పోతూ కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. మునీబా అలీ 32 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. మూడు రన్ఔట్లు పాకిస్థాన్కు పెద్ద దెబ్బగా మారాయి.బౌలింగ్లో ఎలిస్ పెర్రీ ఒకే ఓవర్ వేసి రెండు వికెట్లు తీసింది. సోఫీ మోలినక్స్, సదర్లాండ్ తలా రెండు వికెట్లు సాధించారు. జార్జియా వేర్హామ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచింది.
మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మోలినక్స్ మాట్లాడుతూ… మా జట్టులో చాలా లోతు ఉందని, ప్రతి విభాగంలో మంచి ఎంపికలు ఉన్నాయని చెప్పింది. ఇంకా కొన్ని విషయాల్లో మెరుగుపడాల్సి ఉందని కూడా ఆమె పేర్కొంది.మరోవైపు శ్రీలంక కూడా సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఐర్లాండ్పై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక కెప్టెన్ చమరి అత్తపత్తు అద్భుతమైన సెంచరీతో చెలరేగింది.
మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన అత్తపత్తు 32 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసింది. ఆ తర్వాత మరింత వేగంగా పరుగులు చేసి మహిళల టీ twenty ప్రపంచకప్ చరిత్రలో తన తొలి సెంచరీని నమోదు చేసింది. మొత్తం 106 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది.కొన్ని రోజుల క్రితమే వెస్టిండీస్తో ఓటమి తర్వాత తాను కెప్టెన్గా విఫలమయ్యానని చెప్పిన అత్తపత్తు… ఈ మ్యాచ్తో అద్భుతమైన సమాధానం ఇచ్చింది. జట్టు విజయం సాధించడమే తనకు ముఖ్యమని మ్యాచ్ అనంతరం తెలిపింది.
ఇక మరో మ్యాచ్లో న్యూజిలాండ్ స్కాట్లాండ్పై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. లక్ష్య ఛేదనలో 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ను ఇజ్జీ షార్ప్, బ్రూక్ హాలిడే ఆదుకున్నారు.ఇద్దరూ కలిసి 101 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇజ్జీ షార్ప్ 62 పరుగులతో కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడగా, హాలిడే 41 పరుగులతో అజేయంగా నిలిచింది.అంతకుముందు స్కాట్లాండ్ తరఫున డార్సీ కార్టర్ 72 పరుగులతో రాణించింది. కానీ చివరి ఓవర్లలో న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కాట్లాండ్ 131 పరుగులకే పరిమితమైంది.
న్యూజిలాండ్ కెప్టెన్ మెలీ కెర్ మాట్లాడుతూ. ఇజ్జీ షార్ప్ భవిష్యత్తులో న్యూజిలాండ్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా నిలిచే సామర్థ్యం ఉందని ప్రశంసించింది.ఇలా మహిళల టీ twenty ప్రపంచకప్లో సెమీఫైనల్ పోరు రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. ఇక బుధవారం అజేయంగా కొనసాగుతున్న ఇంగ్లాండ్ జట్టు, వెస్టిండీస్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్పై కూడా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.


