భారత్-ఐర్లాండ్ మధ్య జరగనున్న తొలి టీట్వంటీ మ్యాచ్పై ఇప్పుడు అందరి దృష్టి ఒకే ఆటగాడిపై ఉంది. అతడే 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. శుక్రవారం బెల్ఫాస్ట్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో వైభవ్కు తుది జట్టులో అవకాశం దక్కుతుందా లేదా అన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఒకవేళ వైభవ్ సూర్యవంశీకి ఆడే అవకాశం వస్తే.. భారత పురుషుల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.
వైభవ్ సూర్యవంశీ ఎదుగుదల చాలా వేగంగా సాగింది. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన ఈ యువ బ్యాటర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. 16 ఇన్నింగ్స్లలో 776 పరుగులు సాధించిన వైభవ్.. 237 స్ట్రైక్ రేట్తో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. అంతేకాకుండా ఒకే ఐపీఎల్ సీజన్లో 72 సిక్సర్లు బాది కొత్త రికార్డు కూడా నమోదు చేశాడు.
ఐపీఎల్ తర్వాత ఇండియా ఏ జట్టు తరఫున శ్రీలంకలో జరిగిన ట్రై సిరీస్లో కూడా తన సత్తా చూపించాడు. శ్రీలంక ఏతో జరిగిన వన్డే ఫైనల్ మ్యాచ్లో కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి తనలో ఉన్న ప్రతిభను మరోసారి నిరూపించాడు.
ఇలాంటి అద్భుత ప్రదర్శనల కారణంగానే వైభవ్కు తొలిసారి భారత సీనియర్ జట్టులో చోటు దక్కింది. 15 సంవత్సరాల 71 రోజుల వయసులో భారత జట్టుకు ఎంపికైన వైభవ్.. సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.
సచిన్ 1989లో పాకిస్థాన్పై తన అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పుడు ఆయన వయసు 16 సంవత్సరాలు 205 రోజులు. ఇప్పుడు వైభవ్ తుది జట్టులోకి వస్తే.. సచిన్ కంటే చిన్న వయసులోనే భారత్ తరఫున ఆడిన ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోతాడు.
భారత జెర్సీ ధరించడం తన కల నిజమైన క్షణమని వైభవ్ చెప్పాడు. “ఈ భావాన్ని మాటల్లో చెప్పలేను. చిన్నప్పటి నుంచి బ్యాట్ పట్టుకుని మైదానానికి వెళ్లిన కల ఇప్పుడు నెరవేరింది” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
తొలిసారి టీమ్ ఇండియా జెర్సీ చూసినప్పుడు కలలా అనిపించిందని వైభవ్ తెలిపాడు. ఊహించని విషయం నిజమైనప్పుడు ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదని చెప్పాడు.
ఇప్పుడు అందరి ఎదురుచూపు ఒక్కటే.. బెల్ఫాస్ట్లో జరగనున్న ఐర్లాండ్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం వస్తుందా? లేక ఇంకా వేచి చూడాల్సి వస్తుందా? అన్నది. కానీ భారత క్రికెట్లో కొత్త చరిత్రకు అతను చాలా దగ్గరలో ఉన్నాడనే చెప్పాలి.


