56 నిమిషాలు… సిరాజ్ Magic… ఓవల్లో చరిత్ర సృష్టించిన టీమిండియా! క్రికెట్ చరిత్రలో కొన్ని విజయాలు ఎప్పటికీ అభిమానుల మనసుల్లో నిలిచిపోతాయి. అలాంటి అద్భుత విజయాల్లో ఒకటి.. ఇంగ్లాండ్లోని ఓవల్ టెస్టులో భారత్ సాధించిన 6 పరుగుల సంచలన విజయం. ఇది జరిగి ఏడాది పూర్తయినా.. ఆ మ్యాచ్ గురించి ఇప్పటికీ క్రికెట్ అభిమానులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ మ్యాచ్ చివరి రోజు ఉదయం ఇంగ్లాండ్ గెలవడానికి కేవలం 35 పరుగులు మాత్రమే కావాలి. చేతిలో ఇంకా నాలుగు వికెట్లు ఉన్నాయి. మరోవైపు భారత్కు గెలవాలంటే ఆ నాలుగు వికెట్లు తప్పనిసరిగా తీయాల్సిందే. ఆ పరిస్థితిని చూసిన చాలా మంది.. మ్యాచ్ ఇంగ్లాండ్దే అని అనుకున్నారు. కానీ తర్వాత జరిగిన 56 నిమిషాలు టెస్టు క్రికెట్లోనే అత్యంత ఉత్కంఠభరితమైన క్షణాలుగా నిలిచిపోయాయి. ఆ సిరీస్లో భారత జట్టు ఇప్పటికే ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. సీనియర్ ఆటగాళ్లు లేకుండా కొత్త జట్టుతో బరిలోకి దిగింది.
కెప్టెన్గా శుభ్మన్ గిల్పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. యువ బౌలర్లు ఒత్తిడిని తట్టుకోగలరా అనే సందేహాలు కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో భారత జట్టు మాటలతో కాదు… ఆటతోనే సమాధానం చెప్పింది. ఆ మ్యాచ్లో మహ్మద్ సిరాజ్ అసాధారణ బౌలింగ్ చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతను చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. “ఈ రోజు మ్యాచ్ను నేనే మార్చేస్తానని ఉదయాన్నే నమ్మాను. గూగుల్లో ‘Believe’ అనే ఫోటో డౌన్లోడ్ చేసి నా ఫోన్ వాల్పేపర్గా పెట్టుకున్నాను” అని సిరాజ్ చెప్పాడు. ఆ నమ్మకాన్ని అతను మైదానంలో నిజం చేశాడు. ప్రతి ఓవర్లో ఇంగ్లాండ్పై ఒత్తిడి పెంచుతూ చివరకు ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్లో ఒక భారత పేసర్ చేసిన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇదొకటిగా నిలిచిపోయింది.
చివర్లో గస్ అట్కిన్సన్ ఫుల్టాస్ను మిస్ చేయడంతో స్టంప్స్ ఎగిరిపోయాయి. వెంటనే సిరాజ్ చేతులు చాపి సెలబ్రేట్ చేయగా.. భారత ఆటగాళ్లంతా పరుగెత్తుకుంటూ వచ్చి ఆనందంలో మునిగిపోయారు. అయితే ఈ విజయం ఒక్క సిరాజ్దే కాదు. రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీ చేశాడు. ఆకాశ్ దీప్ కీలక సమయంలో విలువైన పరుగులు చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వికెట్లు తీశాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ యువ ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంచి జట్టును ముందుండి నడిపించాడు. మరోవైపు ఒక చేతికి గాయమైనా క్రిస్ వోక్స్ బ్యాటింగ్కు రావడం అభిమానులను కదిలించింది. జో రూట్, హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ను విజయానికి దగ్గరగా తీసుకొచ్చినా… చివరికి భారత బౌలర్లు మ్యాచ్ను చేజారనివ్వలేదు.
ఆ 56 నిమిషాల్లో ప్రతి బంతి ఉత్కంఠగా మారింది. ప్రతి వికెట్ మ్యాచ్ను మరో మలుపు తిప్పింది. చివరికి కేవలం 6 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అదే భారత టెస్టు చరిత్రలో అత్యంత స్వల్ప తేడాతో వచ్చిన విజయంగా నమోదైంది. ఆ మ్యాచ్ భారత జట్టు కొత్త ప్రయాణానికి గుర్తుగా నిలిచిపోయింది. ఒత్తిడిలో ఎలా పోరాడాలో… చివరి వరకు ఎలా నమ్మకం కోల్పోవద్దో ఈ యువ జట్టు ప్రపంచానికి చూపించింది. ఏడాది గడిచినా… సిరాజ్ చేతులు చాపి చేసిన సెలబ్రేషన్, భారత ఆటగాళ్ల సంబరాలు, ఆ 6 పరుగుల విజయం ఇప్పటికీ ప్రతి భారత క్రికెట్ అభిమాని గుండెల్లో చెరగని జ్ఞాపకంగానే నిలిచిపోయాయి.


