టీ ట్వంటీ ప్రపంచకప్ 2026లో భారత జట్టును ఛాంపియన్గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్కు మళ్లీ టీమిండియాలోకి వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం ఇదే ప్రశ్న భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా బీసీసీఐ వర్గాల నుంచి వచ్చిన సమాచారం సూర్య అభిమానులకు ఊరటనిచ్చేలా ఉంది. టీ ట్వంటీ ప్రపంచకప్ తర్వాత బ్యాటింగ్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సూర్యకుమార్ యాదవ్ను టీ ట్వంటీ కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు కూడా ఎంపిక చేయలేదు.
అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్గా నియమించింది బీసీసీఐ. అయితే శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా తీవ్ర నిరాశపరిచింది. ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్ను 2 – 0 తో కోల్పోయిన భారత్, ఆ తర్వాత ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో ఓడి 4-0తో సిరీస్ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ “సూర్యకుమార్ యాదవ్కు భారత జట్టు తలుపులు ఇంకా పూర్తిగా మూసిపోలేదు.
ప్రస్తుతం అతను జట్టు ప్రణాళికల్లో లేకపోయినా, దేశవాళీ క్రికెట్లో నిలకడగా పరుగులు చేస్తే మళ్లీ ఎంపికయ్యే అవకాశం ఉంది” అని తెలిపారు. అంటే సూర్యకుమార్ రీఎంట్రీ పూర్తిగా అతని ప్రదర్శనపైనే ఆధారపడి ఉంది. దేశవాళీ టోర్నీల్లో మంచి ప్రదర్శన కనబరిస్తే మరోసారి టీమిండియా జెర్సీ ధరించే అవకాశం అతనికి ఉంది. ఇక ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్పై దృష్టి పెట్టింది. ఈ సిరీస్కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులో చేరడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


