భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి టీమ్ మేనేజ్మెంట్ అన్యాయం చేసిందా? మాజీ భారత కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ మాత్రం అవుననే అంటున్నారు. వైభవ్ను ఎలా చూసుకున్నారో తనకు చాలా బాధ కలిగించిందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత జట్టు టీ twenty సిరీస్లు ఆడింది. ఐర్లాండ్ సిరీస్లో వైభవ్ సూర్యవంశీకి ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం రాలేదు. ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన టీ twenty సిరీస్లో సంజూ శాంసన్ వరుసగా మూడు మ్యాచ్ల్లో పెద్ద స్కోర్లు చేయలేకపోవడంతో వైభవ్కు అవకాశం ఇచ్చారు.
వైభవ్ వరుసగా మూడు మ్యాచ్లు ఆడాడు. మాంచెస్టర్లో 14 పరుగులు, నాటింగ్హామ్లో 13 పరుగులు, బ్రిస్టల్లో 15 పరుగులు చేశాడు. ఆ తర్వాత చివరి మ్యాచ్కు అతడిని మళ్లీ జట్టులో నుంచి తప్పించారు. చివరికి ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ 4-0 తేడాతో కోల్పోయింది. చివరి మ్యాచ్కు ముందు టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, “జట్టుకు భవిష్యత్తులో ఏది మంచిదో అదే చేయాలని నిర్ణయించుకున్నాం” అని చెప్పారు. ఈ వ్యాఖ్యపై క్రిస్ శ్రీకాంత్ తీవ్రంగా స్పందించారు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ, టాస్ సమయంలో శ్రేయస్ ఇచ్చిన సమాధానం విని తాను చాలా బాధపడ్డానని చెప్పారు. “ఒక యువ ఆటగాడితో ఇలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. కొత్త ఆటగాళ్లకు నమ్మకం ఇవ్వాలి.
ఒక్కో మ్యాచ్ చూసి వారిని బయటకు పంపితే వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది” అని శ్రీకాంత్ అన్నారు. అంతేకాదు, “ఆటగాళ్లను ప్రదర్శన ఆధారంగా తప్పిస్తే అదే నిబంధన కెప్టెన్కూ, కోచ్కూ కూడా వర్తించాలి. ఆటగాళ్లను మాత్రమే తప్పుబట్టడం సరైంది కాదు. జట్టు ఫలితాలు బాగాలేకపోతే నాయకత్వం కూడా తన బాధ్యత తీసుకోవాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. వైభవ్ సూర్యవంశీ చేసిన తప్పు ఏంటని కూడా శ్రీకాంత్ ప్రశ్నించారు. “వైభవ్ ఏం తప్పు చేశాడు? మూడు మ్యాచ్లు మాత్రమే ఆడిన ఒక 15 ఏళ్ల బాలుడిని వెంటనే బయటకు పంపడం సరైన నిర్ణయమా? యువ ఆటగాళ్లను ఇలా తయారు చేస్తారా?” అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా తనకు జరిగిన ఒక సంఘటనను కూడా శ్రీకాంత్ గుర్తు చేశారు.
1989లో పాకిస్థాన్ పర్యటనలో కేవలం 16 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్, అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పుడు, తానే భారత జట్టు కెప్టెన్గా ఉన్నానని చెప్పారు. ఆ సమయంలో సచిన్ దగ్గరకు వెళ్లి, “ఈ టూర్లో నిన్ను ఎవరూ జట్టులో నుంచి తీసేయరు. భయపడకుండా నీ ఆట ఆడు” అని చెప్పానని శ్రీకాంత్ గుర్తు చేసుకున్నారు. అలాంటి నమ్మకం ఇస్తేనే యువ ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడతారని, మంచి ఆటగాళ్లుగా ఎదుగుతారని ఆయన అన్నారు. “వైభవ్ సూర్యవంశీకి కూడా గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్ అదే నమ్మకం ఇవ్వాల్సింది. మూడు మ్యాచ్లు ఆడించిన వెంటనే జట్టు నుంచి తప్పించడం సరైంది కాదు. ఇలా చేస్తే అతని ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అందుకే ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను” అని శ్రీకాంత్ అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ విషయము పెద్ద చర్చగా మారింది. కొందరు శ్రీకాంత్ వ్యాఖ్యలకు మద్దతు ఇస్తుండగా, మరికొందరు మాత్రం జట్టు ఎంపిక పూర్తిగా మేనేజ్మెంట్ నిర్ణయమే అని అంటున్నారు.


