టీమిండియా ఫిట్నెస్ వ్యవస్థపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వరుసగా వస్తున్న హ్యామ్స్ట్రింగ్ గాయాలు భారత జట్టు ఫిట్నెస్ నిర్వహణపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో ఓటమి తర్వాత భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఇదే అంశంపై తన ఆందోళన వ్యక్తం చేశాడు. గత ఏడాది కాలంగా చూస్తే టీమిండియాలో పలువురు ఆటగాళ్లు సిరీస్ ప్రారంభానికి ముందే లేదా సిరీస్ జరుగుతున్న సమయంలో గాయపడుతున్నారు. దీంతో కీలక మ్యాచ్ల్లో పూర్తి బలంతో జట్టును బరిలోకి దింపడం కష్టంగా మారుతోంది.
ఆటగాళ్ల ఫిట్నెస్ నిర్వహణలో ఎక్కడో లోపం జరుగుతోందని గిల్ అభిప్రాయపడ్డాడు. ఒకప్పుడు టీమిండియా పరిస్థితి ఇలా ఉండేది కాదు. 2023, 2024, 2025లో జరిగిన ఐసీసీ టోర్నమెంట్లకు భారత జట్టు దాదాపు పూర్తి స్థాయి ఫిట్నెస్తోనే వెళ్లింది. అయితే గత ఏడాది సిబ్బందిలో జరిగిన మార్పుల తర్వాత కొత్త వ్యవస్థకు కొంతమంది సీనియర్ ఆటగాళ్లు అలవాటు పడలేకపోతున్నారని సమాచారం. అత్యంత ఆందోళన కలిగిస్తున్న విషయము ఏమిటంటే హ్యామ్స్ట్రింగ్ గాయాలు మళ్లీ మళ్లీ రావడం.
బీసీసీఐకి చెందిన ఒక అధికారి ప్రకారం, ఇటీవలి కాలంలో వరుసగా హ్యామ్స్ట్రింగ్ గాయాలు రావడం చూస్తే ఆటగాళ్లు పూర్తిగా ఫిట్గా లేకుండానే మ్యాచ్లకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. అలాగే ఆటగాళ్ల ఫిట్నెస్ పరిస్థితి, వారి వర్క్లోడ్ గురించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు జట్టు యాజమాన్యం మధ్య సరైన సమాచారం పంచుకోవడంలో లోపం ఉన్నట్లు తెలుస్తోంది. నితిన్ పటేల్ బాధ్యతలు వదిలిన తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మెడికల్ హెడ్ను ఇంకా నియమించలేదు. 2023లో రూపొందించిన ఫిట్నెస్ విధానాల్లో కూడా ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేయలేదు.
ఆటగాళ్ల ఫిట్నెస్కు సంబంధించిన డేటా సేకరణ బాగానే జరుగుతున్నా, ఆ సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ ద్రావిడ్ ప్రధాన కోచ్గా ఉన్న సమయంలో ప్రతి ఆటగాడికి ఏడాది మొత్తం ఫిట్నెస్ ప్రణాళిక సిద్ధం చేసేవారు. బీసీసీఐ మెడికల్ టీమ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, టీమ్ మేనేజ్మెంట్ కలిసి పెద్ద టోర్నమెంట్లను దృష్టిలో పెట్టుకుని, ప్రతి ఆటగాడి శారీరక సామర్థ్యాన్ని దశలవారీగా పెంచేవారు.
ఇప్పుడు ఆ సమన్వయం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి తరచూ గాయపడటం కూడా బీసీసీఐని ఆందోళనకు గురి చేస్తోంది. నితీష్ కుమార్ రెడ్డిని గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయాలని ప్రోత్సహించారని సమాచారం. ఇంగ్లండ్ బౌలింగ్ కోచ్ స్టెఫాన్ జోన్స్తో కలిసి అతను తన వేగాన్ని పెంచేందుకు ప్రయత్నించాడు. కానీ ఇలాంటి మార్పులు ఒక్కసారిగా కాకుండా క్రమంగా జరగాలని నిపుణులు చెబుతున్నారు. అయితే జట్టులో ఉన్న ప్రతిసారి మరింత వేగంగా బౌలింగ్ చేయాలని ప్రయత్నించడం అతని శరీరంపై అదనపు ఒత్తిడిని పెంచిందని అంటున్నారు. హర్షిత్ రాణా విషయంలో కూడా అతను మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే, పాత ఫిట్నెస్ స్థాయికి చేరుకోకముందే మ్యాచ్లకు అనుమతి ఇచ్చారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్త అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. వాషింగ్టన్ సుందర్ను కూడా ఈ ఏడాది టీ twenty ప్రపంచకప్ జట్టులోకి కొంత తొందరగా తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టులో చేరిన తర్వాత కూడా మ్యాచ్ ఆడే స్థాయి ఫిట్నెస్కు రావడానికి అతనికి దాదాపు పది రోజులు పట్టిందని సమాచారం. అయినప్పటికీ టోర్నమెంట్ మధ్యలోనే త్వరగా సిద్ధం కావాలని ఒత్తిడి తీసుకురావడం అతని ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉండొచ్చని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు జస్ప్రీత్ బుమ్రా విషయంలో మాత్రం బీసీసీఐ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. పెద్ద టోర్నమెంట్లు దగ్గరపడే వరకు అతనిపై అధిక ఒత్తిడి పెట్టరు. దశలవారీగా అతని వర్క్లోడ్ను పెంచుతూ అవసరమైన సమయానికి పూర్తి ఫిట్నెస్లోకి తీసుకువస్తారు. ఆకాశ్ దీప్ పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. బెంగాల్ తరఫున వరుసగా రంజీ మ్యాచ్లు, ఆడినప్పుడు అతనికి పెద్దగా గాయాలు రాలేదు. కానీ గత ఐపీఎల్ గాయం నుంచి కోలుకున్న తర్వాత వరుసగా రెండు టెస్టులు ఆడగానే హ్యామ్స్ట్రింగ్ గాయంతో మళ్లీ ఇబ్బంది పడ్డాడు. తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడినా ఇప్పుడు స్ట్రెస్ ఫ్రాక్చర్తో బయటకు వెళ్లాడు. ఇలాంటి గాయాలు ఎందుకు వస్తున్నాయో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లోతుగా, పరిశీలించాల్సిన అవసరం ఉందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.
ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో రెండు అర్ధశతకాలు చేసిన తర్వాత శుభ్మన్ గిల్కూ హ్యామ్స్ట్రింగ్ సమస్య రావడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇక మరో ప్రధాన సమస్య ఏమిటంటే, జాతీయ జట్టుతో ప్రయాణం చేయని సమయంలో ఆటగాళ్లతో బీసీసీఐ మెడికల్ టీమ్ పెద్దగా సంబంధాలు కొనసాగించడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు చాలా మంది ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లు ఆడటం లేదు. అందువల్ల అంతర్జాతీయ సిరీస్ల మధ్య వారికి విరామం లభిస్తోంది. ఆ సమయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందకపోతే వారు తమంతట తామే శిక్షణ తీసుకుంటున్నారు. దీంతో ఫిట్నెస్పై సరైన పర్యవేక్షణ ఉండటం లేదని సమాచారం. ఐపీఎల్ సమయంలో రోహిత్ శర్మ హ్యామ్స్ట్రింగ్ సమస్య కూడా దీనికి ఉదాహరణగా చెప్పబడుతోంది.
ముంబై ఇండియన్స్ యాజమాన్యం దాదాపు నెల రోజుల పాటు సమస్యను గుర్తించలేకపోయినప్పుడు, రోహిత్ స్వయంగా బీసీసీఐ ఫిట్నెస్ రికార్డులను పరిశీలించి తన సమస్యను అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. వాషింగ్టన్ సుందర్ వరుసగా గాయపడుతుండడం, సంజూ శాంసన్ తరచూ బరువు పెరగడం కూడా ఫిట్నెస్ వ్యవస్థలో ఉన్న లోపాలకు ఉదాహరణలుగా బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు కూడా గతంతో పోలిస్తే తగ్గాయని వారు భావిస్తున్నారు. అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాళ్లు కూడా ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కంటే తమ వ్యక్తిగత శిక్షకుల వద్దే శిక్షణ తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఈ పరిస్థితిని మార్చేందుకు బీసీసీఐ మెడికల్ టీమ్ ఆటగాళ్లతో మరింత దగ్గరగా పని చేయాల్సిన అవసరం ఉందని బీసీసీఐ వర్గాలు సూచిస్తున్నాయి.


