కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ గురించి ఇప్పుడు అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఇంగ్లండ్లోని వేగవంతమైన పిచ్లపై, ఎత్తైన ఫాస్ట్ బౌలర్లను అతని హై బ్యాక్లిఫ్ట్ టెక్నిక్ ఎదుర్కోగలదా? కానీ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే… అతను కొట్టిన సిక్సర్లు చూడాల్సిన అవసరం లేదు. అతని చిన్ననాటి ప్రయాణాన్ని చూస్తే చాలు.
వైభవ్ వయసు అప్పటికి కేవలం 13 సంవత్సరాలు. బీహార్లోని బరౌనీ రిఫైనరీ మైదానంలో జరిగిన ఒక జూనియర్ టోర్నమెంట్ ఫైనల్లో, అతను 121 బంతుల్లో 218 పరుగులు చేశాడు. అతని జట్టు మొత్తం 40 ఓవర్లలో 289 పరుగులు చేయగా, అందులో ఎక్కువ భాగం వైభవ్ ఒక్కరే సాధించాడు. ఆ మ్యాచ్ తర్వాత స్థానిక రిపోర్టర్ చిన్న వయసులోనే ఇంత అద్భుతంగా ఆడుతున్నాడంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.
అయితే అసలు ఆసక్తికరమైన విషయము ప్రత్యర్థి జట్టు కెప్టెన్ చెప్పిన మాటలు. “మొదట్లో వైభవ్ చాలా జాగ్రత్తగా ఆడాడు. నేల మీదే షాట్లు ఆడుతూ సమయం తీసుకున్నాడు. ఆ తర్వాతే పెద్ద షాట్లు మొదలుపెట్టాడు. ఒక్క నిర్లక్ష్యమైన షాట్ కూడా ఆడలేదు” అని చెప్పాడు. ఈ మాటలు విన్నప్పుడు వైభవ్ కేవలం దూకుడుగా ఆడే బ్యాటర్ మాత్రమే కాదు, పరిస్థితిని అర్థం చేసుకుని తన ఆటను మార్చుకునే తెలివైన ఆటగాడు కూడా అని అర్థమవుతుంది.
ఇదే విషయాన్ని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా చెప్పారు. రాజస్థాన్ రాయల్స్లో వైభవ్తో కలిసి పనిచేసిన రాథోడ్ మాట్లాడుతూ, “నేను చూసిన యువ ఆటగాళ్లలో అత్యంత క్లీన్ హిట్టర్ వైభవ్” అని అన్నారు. గుజరాత్ టైటాన్స్పై జరిగిన ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్లో మొదటి 21 బంతుల్లో కేవలం 34 పరుగులే చేసిన వైభవ్, చివరికి 53 బంతుల్లో 96 పరుగులతో ఇన్నింగ్స్ ముగించాడు. అంటే పరిస్థితిని బట్టి ఓపికగా ఆడి, తర్వాత వేగం పెంచే సామర్థ్యం కూడా అతనికి ఉందని రాథోడ్ వివరించారు.
ఈ ఏడాది ఐపీఎల్లో ప్రత్యర్థి బౌలర్లు వైభవ్ హై బ్యాక్లిఫ్ట్ను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక ప్రణాళికతో వచ్చారు. కొందరు ఆఫ్సైడ్లో వైడ్ బంతులు వేశారు. మరికొందరు షార్ట్ బాల్స్, యార్కర్లు ప్రయత్నించారు. కానీ వైభవ్ కూడా తన ఆటను మార్చుకున్నాడు. వైడ్ బాల్స్ను కవర్స్ మీదుగా బౌండరీలకు పంపించాడు. ఫుల్ లెంగ్త్ బంతులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. స్లో బాల్స్ వచ్చినప్పుడు తన షాట్ టైమింగ్ను మార్చి పరుగులు సాధించాడు. ఇదే అతని ప్రత్యేకత అని విక్రమ్ రాథోడ్ అన్నారు.
వైభవ్ విజయం వెనుక అతని కుటుంబం చేసిన త్యాగాలు కూడా ఎంతో గొప్పవి. సమస్తిపూర్లోని వారి ఇంటి పక్కనే రెండు ప్రాక్టీస్ పిచ్లు ఏర్పాటు చేశారు. అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ చిన్నప్పటి నుంచే తన కొడుకుకి ప్రత్యేకంగా నెట్ ప్రాక్టీస్ ఏర్పాటు చేసేవారు. తర్వాత మెరుగైన శిక్షణ కోసం పాట్నాలోని అకాడమీలో చేర్పించారు. వారానికి మూడు రోజులు వైభవ్ తల్లి ఉదయం నాలుగు గంటలకే లేచి, తన కొడుకుతో పాటు ప్రాక్టీస్కు వెళ్లే ఐదుగురు బౌలర్లకు కూడా భోజనం తయారు చేసేది. వాళ్లంతా కలిసి రోజంతా సాధన చేసేవారు.
కోచ్ మనీష్ ఓజా కూడా ఒక్కో రోజు ఒక్కో షాట్పై గంటల తరబడి ప్రాక్టీస్ చేయించేవారు. ఒక రోజు మొత్తం కవర్ డ్రైవ్, మరో రోజు పుల్ షాట్, ఇంకో రోజు లాఫ్టెడ్ షాట్లు… ఇలా ప్రతి షాట్ను పర్ఫెక్ట్గా నేర్పించారు. అందుకే ఈరోజు వైభవ్ అన్ని పరిస్థితులకు తగ్గట్టుగా ఆడగల బ్యాటర్గా ఎదిగాడు.
ఐర్లాండ్తో జరిగిన తొలి టీ twenty మ్యాచ్లో వైభవ్కు అవకాశం రాలేదు. అయితే రెండో మ్యాచ్లో అతను బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే. ఇంగ్లండ్ పరిస్థితులు కొత్త కావచ్చు… కానీ సవాళ్లను ఎదుర్కోవడం మాత్రం వైభవ్కు కొత్త కాదు. మరి ఈ యువ సంచలనం ఇంగ్లండ్లో కూడా తన సత్తా చాటుతాడో లేదో చూడాలి.


